వ్యాస పూర్ణిమ – గురుపౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారు?
సదాశివ సమారంభాం
వ్యాస శంకర మధ్యమామ్ అస్మదాచార్య పర్యంతాం
వందే గురు పరంపరామ్॥
ఈ శ్లోకం భారతీయ గురు-శిష్య పరంపర యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే—ఈ జగత్తులో జ్ఞానప్రవాహం పరమేశ్వరుడైన సదాశివుని నుండి ప్రారంభమై, వేదవ్యాస మహర్షి ద్వారా ప్రపంచానికి వ్యాపించి, ఆది శంకరాచార్యులు వంటి మహనీయుల ద్వారా విస్తరించి, చివరకు మనకు జ్ఞానాన్ని అందించిన మన గురువుల వరకు నిరంతరాయంగా కొనసాగుతోంది.
ఈ అఖండ గురు పరంపరకు మన నమస్కారం🙏
అందుకే ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వ్యాస పూర్ణిమ లేదా గురు పౌర్ణిమగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
"గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః॥"
భారతీయ సంస్కృతిలో గురువుకు దేవునికంటే ఉన్నతమైన స్థానం కల్పించారు. తల్లిదండ్రులు శరీరానికి జన్మనిస్తే, గురువు జీవితానికి అర్థాన్ని, ఆత్మకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే "మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ" అని వేదాలు బోధించాయి.
వ్యాస మహర్షి మానవాళికి చేసిన సేవ అపూర్వమైనది. ఒకే మహా వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి, వేదజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మహాభారతాన్ని రచించి, అందులో భగవద్గీత అనే అమూల్యమైన ఆధ్యాత్మిక సంపదను ప్రపంచానికి అందించారు. అష్టాదశ పురాణాలను రచించి సనాతన ధర్మాన్ని శాశ్వతంగా నిలబెట్టారు. అందువల్లే ఆయనను జగద్గురుగా సన్మానిస్తారు.
"గు" అంటే అంధకారం, "రు" అంటే దానిని తొలగించేవాడు. కాబట్టి గురు అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు.
గురు పౌర్ణిమ అనేది కేవలం ఒక పండుగ కాదు; అది కృతజ్ఞతా మహోత్సవం.
మన జీవితాన్ని తీర్చిదిద్దిన గురువులను స్మరించే రోజు. మనకు విద్య, వినయం, వివేకం, సంస్కారం, ధర్మం నేర్పిన ప్రతి గురువుకు నమస్కరించే పవిత్రమైన సందర్భం.
శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి, శ్రీకృష్ణుడికి సాందీపని మహర్షి, ఛత్రపతి శివాజీ మహారాజుకు సమర్థ రామదాసు, స్వామి వివేకానందకు శ్రీరామకృష్ణ పరమహంస గురువులుగా నిలిచి ప్రపంచ చరిత్రను మార్చిన మహనీయులను తీర్చిదిద్దారు.
ఆధ్యాత్మికంగా గురువు అంటే పరమాత్మను చేరుకునే మార్గాన్ని చూపించే దివ్య దీపస్తంభం. గురుకృప లేకుండా ఆత్మజ్ఞానం సిద్ధించదని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే గురువును పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధిస్తారు.
ఈ పవిత్రమైన వ్యాస పూర్ణిమ రోజున మనమందరం మన గురువులను స్మరించి వారి ఆశీర్వాదం పొందాలి. మంచి గ్రంథాలను అధ్యయనం చేయాలి.
జ్ఞానాన్ని సమాజానికి పంచాలి. ధర్మమార్గంలో నడవాలని సంకల్పించాలి.
వ్యాస మహర్షి మనకు ఇచ్చిన సందేశం ఒక్కటే – జ్ఞానమే నిజమైన సంపద; గురువే ఆ సంపదకు ద్వారం.
సమస్త గురు పరంపరకు శతకోటి వందనాలు🙏...
గురు పౌర్ణిమ శుభాకాంక్షలు🙏!
:~ సదా వెంకట్, GSF.